Friday, April 26, 2024

దేవినేని ఉమకు అండగా ఉంటాం.. కుటుంబసభ్యులకు చంద్రబాబు పరామర్శ

ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించినందుకే కక్షతో మాజీ మంత్రి దేవినేని ఉమను అరెస్టు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దేవినేని ఉమ కుటుంబసభ్యులను చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా దేవినేని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉమ రాత్రింబవళ్లు పనిచేశారని.., జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని కుటుంబసభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.

కాగా, కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతుందనే ఆరోపణల నిజనిర్ధరణకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైసీపీ వర్గీయులు రాళ్ల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇది వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారితీయటంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ క్రమంలో వాహనంలోనే ఉమా నిరసనకు దిగారు. దాదాపు ఆరుగంటలపాటు కారులోనే నిరసన తెలిపిన ఉమాను.. పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. కారు అద్దం ధ్వంసం చేసి.. లోపలి నుంచి తలుపు తీసి ఉమాను పీఎస్ కు తరలించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వర్గాలను రెచ్చగొట్టేలా దేవినేని ఉమా వ్యవహరించడంతో ఆయన పై పలు కేసులు నమోదు చేశారు. హత్యాయత్నం కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదుచేశారు. ఉమ సహా 18 మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో ఆయన్ను మాత్రమే అరెస్టు చేశారు. బుధవారం(జులై 28) సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మైలవరం సివిల్‌ జూనియర్‌ జడ్జి కోర్టు ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం దేవినేని ఉమ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement