Thursday, April 25, 2024

కుప్పంలో టీడీపీ నేతల అరెస్ట్.. డీజీపీకి చంద్రబాబు ఫిర్యాదు

చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతలు అమర్నాథ్ రెడ్డి, పులవర్తి నానిలను అరెస్టు చేయటాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. ఈ అంశంపై రాష్ట్ర డీజీపీ, ఎస్ఈసీలకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని అడ్డుకునేందుకు పోలీసుల అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఓ ప్రహసనంగా మార్చారని దుయ్యబట్టారు. టీడీపీ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు అధికార వైసీపీతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను అక్రమంగా తిరస్కరించారని మండిపడ్డారు. పోలీసులు కూడా వైసీపీతో కుమ్మకై టీడీపీ నేతలు ప్రచారం చేయకుండా చూస్తున్నారని ఆరోపించారు. తప్పుడు ఫిర్యాదులుపై అర్ధరాత్రి అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నానిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కుప్పంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేసిన వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో అక్రమాలంటూ సోమవారం రాత్రి టీడీపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కార్యాలయంపై దాడి చేశారంటూ 19 మంది నాయకులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అందులో భాగంగానే అమర్‌నాథ్‌రెడ్డి, పులివర్తి నానిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement