Wednesday, April 24, 2024

మాట తప్పారు.. మడమ తిప్పారు.. ఏపీలో పన్నుల పెంపుపై విష్ణు ఫైర్

ఏపీలో పన్నులు పెంపుపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో పన్నుల పెంపు అధికారం రాష్ట్ర పరిధిలోని అంశమా? లేక  కేంద్ర పరిధిలోని అంశమా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మునిసిప‌ల్ ఎన్నిక‌లకు ముందు వైసీపీ ప్ర‌భుత్వం ప‌న్ను పెంపుపై నోరు మెద‌ప‌లేదని, ఎన్నిక‌ల త‌ర్వాత ప‌న్నులు పెంచిందని మండిపడ్డారు. జగన్ సర్కార్ ప్ర‌జ‌ల‌ను మోసం చేసిందన్నారు. ఏరు దాటేవరకు ఓడ మల్లన్న.. దాటిన తరువాత బోడి మల్లన్న అన్న తీరుతో రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోందని విమర్శించారు.

కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల ప్రకారం ప‌న్నులు పెంచుతున్న‌ట్లు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోందని విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర స‌ర్కారు ప‌న్నులు పెంచాల‌ని చెబితే అన్ని రాష్ట్రాల్లోనూ పెర‌గాలి క‌దా? మ‌రి ఇత‌ర‌ రాష్ట్రాల్లో ఎందుకు పెర‌గ‌లేదు? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థ‌ల ప‌రిధిలో ప‌న్నుల పెంప‌కం కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని అంశం కాదు క‌దా? అని పేర్కొన్నారు. విపక్షాలే ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయ‌ని ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ అంటున్నారని విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీలో ఎన్నిక‌లు అయిపోయాయి కాబ‌ట్టి ఏం చేసినా చెల్లుతుంద‌ని అనుకుంటున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు ఓ చేతితో ఇచ్చి, మ‌రో చేతిలో లాక్కునే చ‌ర్య‌ల‌కు పాల్పడుతోందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం పన్నుల అంశాన్ని ఉపసంహరించుకునే వరకు బీజేపీ పోరాడుతుందని విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement