Thursday, April 25, 2024

కలెక్టర్‌ ఆదేశాలతో ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు..

విజయనగరం, (ప్రభ న్యూస్‌) : జిల్లాలో రెండు సర్పంచ్‌, రెండు వార్డు మెంబర్‌ స్థానాలకు ఆదివారం జరగనున్న ఉప ఎన్నికల పోలింగ్‌, ఓట్లలెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఏ. సూర్యకుమారి పంచాయతీరాజ్‌ అధికారులను ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. కంట్రోలు రూమ్‌ ద్వారా ఆయా గ్ర్రామాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. నెల్లిమర్ల, భోగాపురం మండలాల్లో ఒక్కో సర్పంచ్‌ పదవికి, మక్కువ, ఎల్‌కోట మండలాల్లో ఒక్కో వార్డు సభ్యుల ఎన్నిక కోసం ఆదివారం పోలింగ్‌ జరగనుంది.

ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్‌ సూర్యకుమారి శనివారం జిల్లా అధికారులతో ఈ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లపై వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఆయా గ్రామాల్లోని ఓటర్లంతా నిర్ధేశిత సమయంలో పోలింగ్‌ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి బి. సుభాషిణి మాట్లాడుతూ నెల్లిమర్ల మండలం ఏటీ అగ్రహారం, భోగాపురం మండలం లింగాలవలస గ్రామపంచాయతీ సర్పంచ్‌ల ఎన్నికకు ఆదివారం పోలింగ్‌, కౌంటింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు. అదేవిధంగా మక్కువ మండల కాశీపట్నం పంచాయతీలో ఒకటో వార్డు, ఎల్‌కోట మండలంలో రేగలో 7వ వార్డుళో ఒక్కో వార్డు సభ్యుల ఎన్నిక కోసం ఏర్పాట్లు చేసామన్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలవుతుందని పేర్కొన్నారు.

జిల్లాలో ఆదివారం జరగనున్న పంచాయతీ ఉప ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఏవైనా ఘటనలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు ఐదు మొబైల్‌ నెంబర్లతో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసామని డీపీవో బి.సుభాషిణి వెల్లడించారు. తమశాఖకు చెందిన వై. అజయ్‌కుమార్‌ 9492019194, ఎం. చైతన్యవర్మ 7799491149, కె. ఆదినారాయణ 8688800818, ఎస్‌. పాపారావు 9550296170 నెంబర్లలో కంట్రోల్‌ రూమ్‌లో అందుబాటులో ఉంటారని ఈ నెంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వొచ్చని పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి మొబైల్‌ నెంబర్‌ 7989545123 నెంబర్‌లో కూడా సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement