Wednesday, April 24, 2024

కేఆర్‌ఎంబీ ముందు ఏపీ, తెలంగాణ‌ ఈఎన్సీల వాద‌న‌లు.. సాగర్‌ పై కుదరని ఏకాభిప్రాయం

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నీటి వినియోగం పై తెలుగురాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరేదు. ఏపీ కి నీటి కేటాయింపులు అధికంగా ఉన్నాయనీ, జలవిద్యుత్ ఉత్పాదనకు ఇబ్బందులు వాటిల్లుతున్నాయనీ, రూల్‌ కర్వ్య్‌ పాటించడం లేదని తెలంగాణ చేసిన అభ్యంతరాలను కృష్ణానదీయాజమాన్యం బోర్డు ముందు ఏపీ తోసిపుచ్చింది. ట్రిబ్యునల్‌ అవార్డుమేరకే వినియోగాలున్నాయని వాదించింది. అయితే ఇరుపక్షాలు తమరాష్ట్ర ప్రయోజనాలకోసం నీటి వాటాల పెంపుపై చేసిన వాదనలు విన్న కృష్ణానదీ యాజమాన్యం బోర్డు ఈ అంశాన్ని సీడబ్ల్యూసీ కి రెఫర్‌ చేయనున్నట్లు తెలిపింది. శ్రీశైలం రూల్‌ కర్వ్య్‌ కు సంబంధించి రెండురాష్ట్రాలు అంగికరించాయి. శ్రీశైలం నుంచి ఏపీ కి ట్రిబ్యునల్‌ కేటాయించిన 34 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవాలని కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది.

రిజర్వాయర్ల మేనేజింగ్‌ కమిటీ వాదనలు వినిపించేందుకు కెఆర్‌ఎంబీ చర్చలను సోమవారానికి వాయిదా వేసింది. కృష్ణానదీ జలాల పంపకంలో తెలుగురాష్ట్రాల మధ్య ఉత్పన్నమవుతున్న వివాదాల పరిష్కారంకోసం జలసౌధలో శనివారం కెఆర్‌ఎంబీ సభ్యుడు, ఆర్‌ఎంసీ కన్వీనర్‌ రవికుమార్‌ పి ళ్లే ముందు తెలంగాణ ఇంజనీరంగ్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ రావు, ఏపీ ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణ రెడ్డి వాదనలు వినిపించారు. కృష్ణా నదీ జలాలవాటల్లో జరిగిన అన్యాయాన్ని తెలంగాణ వినిపించింది. కనీసం 575 టీఎంసీల నీటి కేటాయింపు ఉండాలని పట్టిబట్టింది. తెలంగాణలోని కరవుజిల్లా మహబూబ్‌ నగర్‌, ప్లోరైడ్‌ బాధిత జిల్లా నల్గొండ కు సాగునీరు, తాగునీరు అందించేందుకు నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉండాలని పట్టుబట్టింది.

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ ద్వారా నిబంధనలు ఉల్లంఘించి నీటిని తరలించుకు పోతుంటే కెఆర్‌ఎంబీ ఎందుకు స్పందించడంలేదని మురళీధర్‌ రావుప్రశ్నించగా శ్రీశైలం నుంచి 34 టీఎం సీ నీటిని తరలించేందుకు మాత్రమే అనుమతి ఉందని కేఆర్‌ఎంబీ వివరించింది. ఈమేరకే నీటి కేటాయింపులు ఉంటాయని తెలంగాణను కేఆర్‌ఎంబీ శాంత పర్చేందుకు ప్రయత్నించింది. జలాశయాల నిర్వహణకు శాశ్వత కమిటీ వేసేందుకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే వాటాల అంశంతేల్చాల్సిందేనని పట్టుబట్టడంతో సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేశారు.నాగార్జున సాగర్‌ అంశంపై కేంద్ర జలసంఘం సూచనలమేరకే నిర్ణయాలు ఉంటాయనీ ఈ అంశాన్ని సీడబ్ల్యూసీకి పంపించనున్నట్లు కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది.

- Advertisement -

మిగులు జలాలపై స్పష్టత వచ్చింది: ఆర్‌ఎంసీ కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్లై

కృష్ణానదీ మిగులు జలాలపై స్పష్టత వచ్చిందని కేఆర్‌ఎంబీ ఆర్‌ఎంసీ కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్ల్లై చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ నియమావళి పై స్పష్టత వచ్చిందని తెలిపారు. నాగార్జున సాగర్‌ రూల్‌ కర్వ్య్‌ పై ఇంకా స్పష్టతరాలేదని చెప్పారు. అయితే నాగార్జున సాగర్‌ కు సంబంధించి తెలుగురాష్ట్రాలు వినిపించిన వాదనలను, అభ్యంతరాలను సీడబ్ల్యూసీకి రెఫర్‌ చేయనుట్లు తెలిపారు. అలాగే ప్రాజెక్టుల జలవిద్యుత్ ఉత్పత్తి , నీటి కేటాయింపులపై ఇరురాష్ట్రాలు అంగీకరించినట్లు చెప్పారు. 50:50 ఫవర్‌ షేరింగ్‌ కు తెలంగాణ,ఆంధ్ర అంగీకరించాయన్నారు. మిగులు జలాలవిషయంలో స్పష్టత వచ్చిందని ఆయన తెలిపారు. ప్రాజెక్టులు పూర్తీగా నిండి ఓవర్‌ ఫ్లో అయిన అనంతరమే వరదలను మిగులు జలాలకింద పరిగణించేందుకు అంగీకారం కుదిరిందన్నారు.

జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులు పూర్తిగా నిండిన అనంతరం మిగులుజలాలుగా పరిగణించనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోకి కృష్ణా నదీ ప్రవేశించాక ప్రతినీటి చుక్కను లెక్కించాలన్న నిర్ణయానికి రెండు రాష్ట్రాలు అమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలఅంగీకారంతో నివేదికలను ఖరారు చేయనున్నట్లు రవికుమార్‌ తెలిపారు. అయితే సోమవారం జరగనున్నసమావేశంతో ఆర్‌ఎంసీని రద్దుచేసి శాశ్వత ప్రతిపాదికన రిజర్వాయర్ల మేనేజ్‌ మెంట్‌ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కమిటీలో తెలంగాణ, ఆంధ్ర కు చెందిన నీటిపారుదల, విద్యుత్‌ శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారని ఆయన వివరించారు. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ మాట్లాడుతూ చర్చల ద్వారా అనేక సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు.

నాగార్జున సాగర్‌ విషయంలో తెలంగాణ అభ్యంతరాలను కేఆర్‌ఎంబీ పరిగణలోకి తీసుకుని సీడబ్యూసీకి రెఫర్‌ చేయనుందన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి ఏపీ 34 టీఎంసీలకు మించి నీటిని తోడితే తెలంగాణ అంగీకరించదన్నారు. ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం రిజర్వాయర్‌ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. రూల్స్‌ కర్వూ,నీటి మట్టాలు, ఫవర్‌ ఉత్పత్తి విషయాల్లోని పలుఅంశాల్లో ఏకాభిప్రాయం కుదిరిందన్నారు.ఈ సమావేశంలో కేఆర్‌ఎంబీ సభ్యుడు మౌంతాంగ్‌, జన్కో డైరెక్టర్‌ వెంకటరాజం తదితర జలనిపుణులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement