Thursday, April 18, 2024

షరిషత్ ఎన్నికలపై ఎస్ఈసీ అప్పీల్… ఓట్ల లెక్కింపునకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి

ఏపీలో పరిషత్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) హైకోర్టులో అప్పీల్ చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో ఎస్ఈసీ సవాల్ చేసింది. ఇప్పటికే పోలింగ్ ముగిసిందని, ఓట్ల లెక్కింపునకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో కోరింది.

ఎన్నికలకు నాలుగు వారాల ముందు కోడ్ అమలు చేయాలన్న సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించారని, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ప్రభుత్వం పాటించలేదని గత నెలలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలు చెల్లవంటూ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. ఎన్నికల కమిషనర్ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఏడాదికిపైగా కొనసాగుతోంది. పరిషత్‌ ఎన్నికలకు గతేడాది మార్చి 7న ఎన్నికల నోటిఫికేషన్‌ను అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ జారీ చేశారు. అయితే, తుది అభ్యర్ధుల జాబితాలు ఖరారైన తర్వాత కరోనా ఉద్ధృతితో ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. నిమ్మగడ్డ పదవి కాలం ముగియడంతో ఆయన స్థానంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌ 8వ తేదీన మధ్యలో ఆగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పరిషత్‌ ఎన్నికలపై కోర్టును ఆశ్రయించడంతో మే 21న ఆగిపోయిన ఎన్నికల కొనసాగింపునకు ఏప్రిల్‌ 1న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తీర్పు హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలు వెలువరించింది. కాగా, 2020 మార్చిలో పరిషత్‌ ఎన్నికల నామినేషన్ల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 126 జడ్పీటీసీ, 2,371 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి.

ఇదీ చదవండి: దత్తత గ్రామానికి సీఎం కేసీఆర్…

Advertisement

తాజా వార్తలు

Advertisement