Wednesday, April 24, 2024

ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మొబైల్‌ ఆక్సిజన్‌ బెడ్లు


కోవిడ్‌ మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మొబైల్‌ ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. మంత్రి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో సత్వరమే వైద్యం అందించేలా ఆర్టీసీ స్లీపర్‌ ఏసీ బస్సుల్లో పది ఆక్సిజన్‌ కాన్సెంట్రేట్‌ మిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం గ్రీన్‌కో సంస్థ అధినేత చలమలశెట్టి అనిల్‌ ముందుకొచ్చినట్టు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో త్వరలోనే మొబైల్‌ ఆక్సిజన్‌ బెడ్స్‌ అందుబాటులో కొస్తాయన్నారు. ఇలానే దాతలు మరింత మంది ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇక కోవిడ్‌ ఆస్పత్రుల్లో సేవలందించేందుకు వైద్య కోర్సు చేసిన వారు, నర్సింగ్‌ విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ కోవిడ్‌ కేర్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. అనంతరం మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్‌ కాలేజీ వసతి గృహంలోని కేర్‌ సెంటర్‌ను సందర్శించి అక్కడ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ను ఏర్పాటు చేయించారు. సమీక్షలో బందరు ఆర్డీవో ఖాజావలి, డ్వామా పీడీ సూర్యనారాయణ, డీఎస్పీ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement