Wednesday, April 24, 2024

చంద్రబాబుపై రాళ్ల దాడి జరగలేదు: హోం మంత్రి

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న రోడ్‌షోలో సోమవారం రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. తిరుపతిలోని గాంధీ రోడ్డు షోలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై రాయి విసిరారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో టీడీపీకి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు.  ఓటమి భయంతో వైసీపీ దాడికి పాల్పడుతోందని మండిపడుతున్నారు.

అయితే, ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. చంద్రబాబు రోడ్ షోపై రాళ్ల దాడి జరగలేదని ఆమె అన్నారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలో సానుభూతి ఓట్లు పొందడం కోసమే ఈ ఎత్తుగడ వేశారని ఆరోపించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు రాళ్ల దాడి నాటకాలకు తెరలేపారని విమర్శించారు. వైసీపీ నేతలపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని, రాళ్ల దాడి చేయాల్సిన అవసరం వైసీపీ నేతలకు లేదన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తిరుపతి బరిలో వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని సుచరిత ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు ఈ ఘటనపై తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు, టీడీపీ నేత నరసింహ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని పేర్కొన్నారు. ప్రచారం చేయకుండా భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. పకడ్భందీగా భద్రత కల్పించాలని.. ప్రచారం సజావుగా సాగేలా చూడాలని కోరారు. నరసింహా యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 324, 143, 427 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

కాగా.. తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ హోరాహోరిగా ప్రచారం చేస్తున్నాయి. రోడ్డు షోలో రాళ్ల దాడి అనంతరం చంద్రబాబు వైపీపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దమ్ముంటే ముందుకు రావాలని.. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement