Thursday, April 25, 2024

ఎస్‌ఈసీగా నీలం సాహ్నిని కొనసాగించొద్దు ఏపీ హై కోర్టులో పిల్..

ఏపీ ఎన్నికల కమిషనర్‌ గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి నీలం సాహ్ని కొనసాగడాన్ని రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ప్రకటించాలంటూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. గుంటూరుకు చెందిన డాక్టర్‌ మద్దిపాటి శైలజ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా నీలం సాహ్ని రూ.160 కోట్ల ప్రజాధనం వృథా చేశారన్నారు. ఆ సొమ్మును ఆమె నుంచి రాబట్టేందుకు వీలుగా రూ.160 కోట్లకు బ్యాంక్‌ పూచీకత్తు సమర్పించేలా ఆదేశించాలని అభ్యర్థించారు.

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో నీలం సాహ్నిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరపనుంది. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా నీలం సాహ్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసిందన్నారు. ప్రభుత్వ భవనాలకు రాజకీయ పార్టీ రంగులు తొలగించాక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎస్‌గా ఉన్నప్పుడు కోర్టుకు హామీ ఇచ్చిన నీలం సాహ్ని.. అందుకు కట్టుబడి వ్యవహరించలేదన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ఎస్‌ఈసీగా కొనసాగడాన్ని చట్ట, రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని పిటిషన్‌లో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement