Thursday, March 28, 2024

Bigg Boss: రియాల్టీ షోపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలుగు రియాల్టీ షో బాగ్ బాస్ పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రియాల్టీ షో పేరుతో ఏది పడితే అది చూపిస్తామంటే కుదరదని, తాము కళ్లు మూసుకుని కూర్చోలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. షోలో హింసను ప్రోత్సహిస్తూ సంస్కృతి అని ఎలా అంటారని ప్రశ్నించింది. బిగ్‌బాస్ షో అసభ్యతను, అశ్లీలతను ప్రోత్సహించేలా ఉందని పేర్కొంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి గతంలో హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి కోర్టును అభ్యర్థించారు. దీంతో సోమవారం జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం పిటిషన్ ను విచారించింది.

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌ రెడ్డి తన వాదనలు వినిపించారు. పిటిషనర్ ఇలాంటి వ్యాజ్యాన్నే తెలంగాణ హైకోర్టులో వేసి ఉపసంహరించుకున్నారని తెలిపారు. రియాలిటీ షోల నిర్వహణకు విధివిధానాలు ఉంటాయన్నారు. వివిధ సంస్కృతుల ఆధారంగా షోలు ఉంటాయని తెలిపారు. దీంతో స్పందించిన ధర్మాసనం.. హింసను ప్రోత్సహించడం సంస్కృతి ఎలా అవుతుందని ప్రశ్నించింది. న్యాయవాది తన వాదనలు కొనసాగిస్తూ.. 2019లో ఈ వ్యాజ్యం దాఖలైనట్టు గుర్తు చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని ప్రధాన న్యాయమూర్తి నేతృతంలోని బెంచ్‌ను పిటిషనర్ తరపు న్యాయవాది కోరారని, అయితే అందుకు అనుమతి రాలేదని చెప్పారు.

పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ.. ఈ వ్యాజ్యాలపై విచారణ జరపాలని సీజే నేతృత్వంలోని బెంచ్‌ను కోరడం నిజమేనని అంగీకరించారు. అలా కోరే హక్కు పిటిషనర్‌కు ఉందన్నారు. కల్పించుకున్న న్యాయస్థానం ఆ విషయాన్ని ఎందుకు దాచారని ప్రశ్నించింది. కోర్టులో నిజాయతీగా వ్యవహరించాలని సూచించింది. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ అవసరమని భావిస్తే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్‌ ఎదుట అభ్యర్థించేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఈ వ్యాజ్యాన్ని విచారణ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. సీజే ధర్మాసనం వద్దే ఈ వ్యాజ్యం గురించి ప్రస్తావించుకోవాలని చెబుతూ ఉత్తర్వులు జారీచేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement