Thursday, April 25, 2024

నెల రోజుల్లో వారికి వ్యాక్సినేషన్ పూర్తి!

రాబోయే నెల రోజుల్లో 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,06,47,444 డోసులు పంపిణీ చేసినట్లు చెప్పారు. వాటిలో 25,65,162 మందికి రెండు డోసులు, 55,13,120 మందికి ఒక డోసు వేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 45 ఏళ్లు పైబడిన వారికి 53.08 శాతం మేర కనీసం ఒక డోసు వ్యాక్సిన్ వేశామన్నారు. రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి 1,33,07,889 మంది ఉండగా, వారిలో. 18,66,082 మందికి రెండు డోసులు, 47,91,032 మందికి ఒక డోసు వేశామన్నారు. 45 ఏళ్లు పైబడిన జనాభాలో 50 శాతం మందికి కనీసం ఒక టీకా వేసినట్లు ఆయన తెలిపారు.

గత రెండ్రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు 10 వేలకు అటు ఇటుగా నమోదవుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 1,774 ఐసీయూ బెడ్లు, 8,164 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలోనూ రోజు రోజుకూ కరోనా బాధితుల సంఖ్య తగ్గుతూ వస్తోందన్నారు. శనివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొవిడ్ కేర్ సెంటర్లలో 12,247 మంది చికిత్స పొందుతున్నారన్నారు. 3,247 మంది డిశ్ఛార్జి కాగా, 1,248 మంది వివిధ ఆసుపత్రుల్లో అడ్మిషన్ పొందారన్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం రోజువారీగా 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించగా, కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో గడిచిన 24 గంటల్లో 406 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ ను డ్రా చేశామన్నారు. రాష్ట్రంలో 1,460 బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించామన్నారు.

ఇది కూడా చదవండి: తమిళనాడులో మళ్లీ లాక్‌ డౌన్‌ పొడగింపు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement