Saturday, April 20, 2024

ఏపీలో పదవుల పందేరం.. 481 మంది డైరెక్టర్లను నియమించిన జగన్

ఏపీలో వైసీపీ ప్రభుత్వం మరోసారి భారీ ఎత్తున పదవుల పందేరం చేసింది. ఏకంగా 481 మందికి పదవులు కట్టబెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను నియమిస్తూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్‌ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కార్పొరేషన్‌ డైరెక్టర్ల నియామకంలో మహిళలకు 52 శాతం పదవులు కట్టబెట్టారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం డైరెక్టర్ల నియామకానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో కార్పొరేషన్‌ చైర్మన్ల నియామకానికి సంబంధించిన ఊసే లేదన్నారు. రాజ్యసభ సీటు విషయంలో చంద్రబాబు ఎస్సీలను తీవ్రంగా అవమానించారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంక్‌గానే చూశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మాత్రం స్వయంగా డైరెక్టర్ల నియమకంలోనూ పాల్గొని అన్ని వర్గాలకు పెద్దపీట వేశారన్నారు.

కార్పొరేషన్ల స్థాయిలోనే సామాజిక న్యాయం అమలయ్యే విధంగా సీఎం జగన్ జాబితా తయారు చేశారని సజ్జల వివరించారు. కార్పొరేషన్ డైరెక్టర్లలో ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం పదవులు కేటాయించినట్లు వెల్లడించారు. ఎన్నడూ లేని విధంగా మహిళలకు ఏకంగా 52 శాతం పదవులు కట్టబెట్టినట్లు ప్రకటించారు. ఇక, ఓసీలకు 42 శాతం పదవులు ఇచ్చినట్లు సజ్జల తెలిపారు. బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకురావడమే సీఎం జగన్‌ లక్ష్యమని సజ్జల వెల్లడించారు.

మహిళలకు సీఎం వైఎస్‌ జగన్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చారని హోంమంత్రి సుచరిత అన్నారు. కార్పొరేషన్‌ డైరెక్టర్ల నియామకంలో మహిళలకు 52 శాతం పదవులు ఇచ్చారన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలన్నీ మహిళల పేరు మీదే ఇచ్చి వారి ప్రాధాన్యం ఏమిటో చెప్పారని సుచరిత చెప్పారు.

- Advertisement -

ఇది కూడా చదవండిః విజయసాయి సింహాచల దర్శనంపై వివాదం.. సంప్రోక్షణ చేయాలని డిమాండ్

Advertisement

తాజా వార్తలు

Advertisement