Wednesday, April 24, 2024

ప్రభుత్వ స్కూళ్ల సమీపంలో ఆ షాపులు బంద్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల చుట్టూ కలుషిత వాతావరణం లేకుండా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలకు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్లు అమ్మే షాపులు ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్ల సమీపంలోని పరిస్థితులను ఇకపై ఏఎన్‌ఎంలు పర్యవేక్షిస్తూ ఉంటారని ప్రభుత్వం వెల్లడించింది.

ఒక్కో ఏఎన్‌ఎంకు రెండు, మూడు పాఠశాలల బాధ్యతలు అప్పగించనున్నారు. ఏఎన్‌ఎం వెళ్లి స్కూలు సమీపంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది. దీని కోసం ఒక ప్రత్యేక యాప్‌ను కూడా తయారు చేశారు. ఈ యాప్‌ ద్వారా అక్కడి ఫొటోలు తీసి అప్‌ లోడ్‌ చేస్తుండాలి. స్కూళ్లకు సమీపంలో ఎవరైనా సిగరెట్, గుట్కా, పాన్‌షాపులు నిర్వహిస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పాఠశాలల సమీపంలో మద్యం షాపులు ఉన్న, ఎవరైనా మద్యం సేవించినా వారిపై కఠినచర్యలు తప్పవని స్పష్టం చేశారు. అంతేకాదు, ఉపాధ్యాయులెవరైనా స్కూల్‌ ఆవరణలో స్మోకింగ్‌ చేస్తే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చెడు అలవాట్ల ప్రభావం చిన్నపిల్లలపై పడకూడదన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన చర్యలు చేపట్టింది.

ఇదీ చదవండి: ఏపీలోని 8 జిల్లాల్లో కరోనా ఆంక్షల సడలింపు

Advertisement

తాజా వార్తలు

Advertisement