Friday, April 19, 2024

AP: రేపు ఢిల్లీకి చంద్రబాబు అండ్ టీమ్‌.. రాష్ట్రపతి పాలనకు డిమాండ్..

టీడీపీ ఆఫీసులు, లీడ‌ర్ల‌పై జరుగుతున్న దాడులపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు కంప్లేంట్‌ చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు 18 మందితో కూడిన తెలుగుదేశం నేతల బృందం రేపు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవనుంది.

ఈ మేరకు మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కూడా ఖరారైంది. నిజానికి ఢిల్లీకి 18 మంది బృందం వెళ్తున్నప్పటికీ కరోనా నేపథ్యంలో చంద్రబాబు సహా ఐదుగురికి మాత్రమే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ లభించింది.

టీడీపీ బృందంలో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, ఎంపీలు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్యనేతలున్నారు. రేపు, ఎల్లుండి ఢిల్లీలోనే ఉండే ఈ నేతలు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్ర పరిస్థితులపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా వారి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పెరిగిపోయిందని, డ్రగ్స్, గంజాయి సాగుకు ఏపీ కేంద్రంగా మారింద‌ని టీడీపీ ఈ సందర్భంగా ఆరోపించింది. ప్రభుత్వంలోని కొందరు పెద్దలే వీటిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement