Saturday, April 20, 2024

ఏపీ కేబినెట్ కు విస్తరణ ముహూర్తం ఫిక్స్..!!

ఏపీలో సీఎం జగన్ తన కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కేబినెట్ ను పూర్తిగా తప్పించి కొత్త వారితో ఎన్నికల కేబినెట్ ఏర్పాటుకు రంగం సిద్దమవుతోంది. ఇందు కోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభమైనట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా మంత్రి బాలినేని సీఎం తనతో చెప్పిన విషయాలను బయట పెట్టటం వెనుక కూడా ఒక వ్యూహం ప్రకారమే జరిగినట్లుగా కనిపిస్తోంది.

ఇప్పుడున్న మంత్రుల్లో కొందరిని తొలిగించి మరి కొందరిని కొనసాగిస్తే కొత్త సమస్యలు తప్పవనే అంచనాకు వచ్చారు. దీంతో విధానపరమైన నిర్ణయంగా అందరినీ తప్పిస్తే సమస్య ఉండదని భావిస్తున్నారు.2024 ఎలక్షన్ కేబినెట్ కసరత్తు షురూ
ఇదే సమయంలో చాలా మంది సీనియర్లు..పార్టీ కోసం తొలి నుంచి పని చేస్తున్న వారు..బలమైన వాయిస్ ఉన్న వారికీ తొలి సారి కేబినెట్ లో స్థానం దక్కలేదు. దీంతో ఈ సారి వారికి ఛాన్స్ కనిపిస్తోంది.

దసరా సమయంలో విస్తరణ ఉంటుందనే అంచనాలు ప్రభుత్వంలో.. పార్టీలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇంటలిజెన్స్.. సర్వే సంస్థల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా సీఎం జగన్ కేబినెట్ కూర్పు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రాంతీయ-సామాజిక సమీకరణాలు కీలకం కావటంతో ఏ జిల్లా నుంచి ఎవరు రేసులో ఉన్నారు. సామాజికంగా ఎవరికి అవకాశం ఉందనే చర్చ మొదలైంది.

ప్రాంతీయ – సామాజిక సమీకరణాలే కీలకం

- Advertisement -

శ్రీకాకుళం జిల్లా నుండి ప్రస్తుత స్పీకర్‌ తమ్మినేని సీతారాం మంత్రి పదవి ఆశిస్తున్నారు. అదే విధంగా ధర్మాన క్రిష్ణదాస్ స్థానంలో సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు ఖాయమని చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో కొత్తగా కోలగట్ల వీరభద్రస్వామి..పీడిక రాజన్నదొర రేసులో ముందున్నారు. అయితే, ఎస్టీ మహిళకు అవకాశం ఇవ్వాలని భావిస్తే రాజన్న దొరకు ఛాన్స్ కష్టమే. విశాఖ జిల్లా నుండి గుడివాడ అమర్‌నాథ్‌, కరణం ధర్మశ్రీ,పెట్ల ఉమా శంకరగణేష్‌ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అయితే,ఈ జిల్లా నుంచి ముత్యాల నాయుడు పేరు వినిపిస్తోంది. నిఘా- సర్వే నివేదికల ఆధారంగా విశాఖ నగరానికి అవకాశం ఇవ్వాలనుకుంటే అమర్ నాధ్ కు ఛాన్స్ ఉంది.

గిరిజన కోటాలో ఫాల్గుణ, కె.భాగ్యలక్ష్మి కూడా మంత్రి పదవిని కోరుకుంటున్నారు. ఇక,తూర్పు గోదావరి జిల్లా నుండి ఇప్పుడున్న ముగ్గురు స్థానంలో కొత్త ముగ్గురికి ఛాన్స్ దక్కనుంది. దాడిశెట్టి రాజా మంత్రి పదవిని కోరుకుంటున్నారు. పైగా యనమల సోదరుడిని రెండు సార్లు ఓడించటంతో పాటుగా తొలి నుంచి జగన్ విధేయుడిగా ఉన్నారు. కన్నబాబు స్థానం ఆయనతో భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ జిల్లా నుంచి ఎస్సీ కోటా నుంచి ఒకరికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది.

మహిళలు- బీసీ వర్గాలకు ప్రాధాన్యం అయితే,ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీకి దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. బీసీ వర్గానికి ఇక్కడ ప్రాతినిధ్యం కల్పించాలి. దీంతో ముమ్మడివరం ఎమ్మెల్యే సతీష్ కు ఖాయమని ప్రచారం సాగుతోంది. గిరిజన కోటాలో నాగులాపల్లి ధనలక్ష్మి పోటీలో ఉన్నారు. ఈమె భర్త ప్రస్తుతం డిసిసిబి ఛైర్మన్‌గా ఉన్నారు. పశ్చిమగోదావరిలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. రాజకీయంగా ఉభయ గోదావరి జిల్లాలు కీలకం కావటంతో ఈ జిల్లా నుంచి ఎస్సీ-క్షత్రియ-కాపు వర్గానికి అవకాశం దక్కనుంది.

క్షత్రియ కోటాలో ముదునూరి ప్రసాద రాజు… కాపు వర్గం నుంచి కొట్టు సత్యానారాయణ లేదా గ్రంధి శ్రీనివాస్ పేర్లు రేసులో ఉన్నాయి. ఎస్సీ వర్గం నుంచి తలారి లేదా ఎమ్మెల్సీకి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.
సీనియర్లకు ఇప్పుడు బెర్తు ఖాయమంటూ కృష్ణాజిల్లాలో కొలుసు పార్థసారధికి ఖాయమని తెలుస్తోంది. కమ్మ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్ మంత్రి పదవి దద్కించుకొనే ఛాన్స్ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అబ్బయ్య చౌదరి పేరు వినిపిస్తున్నా..కమ్మ వర్గానికి క్రిష్ణా లేదా గుంటూరు జిల్లా నుంచే ఎంపిక చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక, కృష్ణ జిల్లా నుంచి సామినేని ఉదయభాను..మల్లాది విష్ణు..జోగి రమేష్‌.మేకా వెంకట ప్రతాప అప్పారావు కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు.

టీడీపీ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కొత్త వ్యూహాలతో గుంటూరు జిల్లా నుండి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోదరుడు అయోధ్య రామిరెడ్డికి ఎంపి అవడంతో ఆర్కేకు మంత్రి పదవి ఇస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడదల రజని, ముస్లిం మైనార్టీ నుండి మహ్మద్‌ ముస్తఫా మంత్రి పదవిని ఆశిస్తున్నారు.
కాపు కోటాలో అంబటి రాంబాబుకు ఖాయమని చెబుతున్నారు.

ప్రకాశం జిల్లా నుండి గతంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా చేసిన మహీధర్‌రెడ్డికి బెర్తు దొరకనున్నట్లు తెలిసింది.
అన్నా రాంబాబు కూడా సీటు కోరుతున్నారు. పార్టీని ముందుంచి నడిపించే వారితోనే నెల్లూరు నుండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి,ఆనం రామ నారాయణరెడ్డి, ఎస్‌సి కోటాలో కిలివేటి సంజీవయ్య మంత్రి పదవి రేసులో ఉన్నారు. చిత్తూరు జిల్లా నుండి రోజా,చెవిరెడ్డి భాస్కరరెడ్డి బరిలో ఉన్నారు.

కడప నుండి కొరుముట్ల శ్రీనివాసులు..శ్రీకాంత్ రెడ్డి ప్రముఖంగా రేసులో ఉన్నారు. అయితే,సీ రామచంద్రయ్య కు అవకాశం దక్కే ఛాన్స్ ఉందని సమాచారం. అనంతపురం జిల్లాలో అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఉండగా… మహిళా కోటాలో ఉషశ్రీచరణ్‌, జనులగడ్డ పద్మావతి, ఎస్‌సి కోటాలో తిప్పేస్వామి పోటీ పడుతున్నారు.

జగన్ పైపు ఆశావాహుల చూపులు.

కర్నూలు నుండి శిల్పా చక్రపాణిరెడ్డికి ఖాయమని ప్రచారం సాగుతోంది. బుగ్గనను సైతం తప్పిస్తుండటంతో రెడ్డి వర్గంతో పాటుగా బీసీ వర్గానికి ఈ జిల్లా నుంచి అవకాశం దక్కనుంది. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ..సామాజిక సమీకరణాలు – జిల్లాల లెక్కలు…వచ్చే ఎన్నికలు..ప్రతిపక్షాల బలం వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సీఎం జగన్ తన ఎన్నికల కేబినెట్ ను డిసైడ్ చేయనున్నారు. దీంతో.. ఈ ఆశావాహుల్లో చివరికి బెర్తు ఖాయమయ్యేది ఎవరికో జగన్ నిర్ణయం తరువాతనే అధికారికంగా తెలిసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement