Friday, March 29, 2024

AP | దారుణం.. ఇద్దరు చిన్నారులకు నిప్పంటించి, ఆత్మహత్యకు యత్నించిన తల్లి

మదనపల్లె టౌన్, (ప్రభ న్యూస్): కుటుంబ కలహాలు, ప్రేమ వివాహం వల్ల తనవాళ్లు దూరం కావడం, సంసారంలో ఎదురవుతున్న ఒడిదుడుకులు ఓ మహిళను విచక్షణ కోల్పోయేలా చేశాయి. ముక్కు పచ్చలారని తన ఇద్దరు బిడ్డలకు నిప్పంటించి, ఆ మంటల్లోనే దూకి తానూ చావాలనుకుంది. చివరి నిమిషంలో ఆమెను స్థానికులు కాపాడగా, ఇద్దరు ఆడ బిడ్డలు మాత్రం కళ్ళెదుటే అమ్మా..‌ అమ్మా.. అంటూ మాడి మసైపోయ్యారు. కర్నాటక రాష్ట్రంలో ఇవ్వాల (బుధవారం) జరిగిన ఈ దారుణ ఘటనలో ఇద్దరు బిడ్డలను కోల్పోయిన కుటుంబం అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం, ఉలపాడు పంచాయతీ, బుసాని కురప్పల్లి. వివరాలు ఇలా ఉన్నాయి.

బుసాని కురప్పల్లి గ్రామానికి చెందిన బుసన్నగారి శంకరప్ప, లలితమ్మల కుమార్తె జ్యోతి ప్రేమ వివాహం చేసుకుని భర్తతో పాటు కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్లింది. ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. కుటుంబంలో ఇటీవల కలహాలు మొదలయ్యాయి. తనవాళ్లు దూరంగా ఉన్నారు. ఒత్తిడికి గురయిన జ్యోతి పేగుతెంచుకు పుట్టిన బిడ్డలకు నిప్పంటించి తాను కూడా ఆత్మ హత్య చేసుకుని చని పోవాలనుకుంది. విచక్షణ కోల్పోయి కసాయిగా మారింది. ఇద్దరు ఆడబిడ్డలకు నిప్పటించింది.

తాను కూడా మంటల్లో దూకి చనిపోవాలని ప్రయత్నించే సమయంలో.. ఆ పసిబిడ్డల కేకలు విన్న స్థానికులు ఆమెను కాపాడారు. మృత్యువుతో పోరాడుతున్న పసిపాపను ఆస్పత్రికి, మరో పాప మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి పోలీసులు తరలించారు. గుండెలు పిండేసే ఈ విషాదకర ఘటనకు పాల్పడిన ఆ మహిళది అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం, ఉలపాడు పంచాయతీ, బుసాని కురప్పల్లి కావడంతో జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement