Thursday, April 25, 2024

ప్ర‌భుత్వాసుప‌త్రుల‌లో ‘ఓపీ’ హ్యాపీ…

అమరావతి, ఆంధ్రప్రభ: స్పెషలిస్ట్‌లు అందుబాటులోకి రావడంతో ప్రభుత్వాసు పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్‌ తరహా వైద్యం పేదలకు అందుతుండటంతో ప్రభుత్వాసుపత్రు లకు రోగులు క్యూ కడుతున్నారు. ప్రభుత్వాపత్రుల్లో గతంతో పోలిస్తే 18 నుంచి 22 శాతం మేర ఓపీ పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ పట్నం వంటి ప్రధాన నగరాల్లోని జీజీహెచ్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ ఆధీనంలో పనిచేసే ఏరియా ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతోంది. ఖరీదైన వైద్యం ఖర్చు లేకుండా అందుతుండటం రోగులు, వారి కుటుంబా లకు వైద్య ఖర్చుల నుంచి ఉపశమనం లభిస్తోంది.

అందుబాటులోకి స్పెషలిస్ట్‌లు
పిడియాట్రిక్‌, కార్డియాలజీ, నెఫ్రాజలజిస్ట్‌ (కిడ్నీ), వ్యాస్కులర్‌ (నరాల) ఆపరేషన్లకు సంబంధించి స్పెషలిస్ట్‌ డాక్టర్లు ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులోకి వచ్చారు. గతంలో గుండె ఆపరేషన్లకు సంబంధించి కార్డియాలజిస్ట్‌లు ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో లేకపోవడంతో పీపీఓ పద్ధతిలో బటయ నుంచి వైద్య నిపుణుల్ని పిలిపించే వారు. అదికూడా అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే. ఇప్పుడు ప్రధాన విభాగాలకు సంబంధించి స్పెషలిస్ట్‌లు 96 శాతం అందుబాటులోకి వచ్చారు. దేశవ్యాప్తంగా స్పెషలిస్ట్‌, సూపర్‌ స్పెషలిస్ట్‌ పోస్టుల్లో 61 శాతం ఖాళీలు ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 4 శాతం మాత్రమే ఖాళీలు ఉన్నాయి. 2019 జూన్‌ నాటికి ఎపి వైద్య విధానపరిషత్‌ ఆస్పత్రుల్లోనే దాదాపు 1,250కి పైగా స్పెషలిస్టు డాక్టర్ల పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇందులో 463 ఉద్యోగోన్నతి పోస్టులు కాగా 792 పోస్టులు ప్రత్యక్ష నియామక సిఎఎస్‌ పోస్టులు. ఎపివివిపి పరిధిలోని ఆస్పత్రుల్లో ఖాళీగా వున్న అన్ని పోస్టులనూ భర్తీ చేయాలన్న లక్ష్యంతో ఇప్పటి వరకూ ఎనిమిది నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో 277 గైనకాలజిస్టులు, 234 అనెస్థీషియన్లు, 146 పెడియాట్రీ-షియన్స్‌, 144 మంది ఫిజీషియన్స్‌, 168 మంది జనరల్‌ సర్జన్స్‌, 55 మంది ఆర్థోపెడిషియన్స్‌, 78 మంది ఆప్తమాలజిస్ట్లు, 65 మంది ఇఎ స్పెషలిస్టులతో పాటు- ఇతర విభాగాలకు చెందిన స్పెషలిస్టు డాక్టర్లు మరో 145 పోస్టులకు నియామక ఉత్తర్వులతో కలిపి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చెెసింది. ఎపివిపి ఆస్పత్రుల్లో ప్రత్యక్ష నియామకంలో నియమితులైన వారితో పాటు- ఉద్యోగోన్నతి ద్వారా మరో 215 మంది స్పెషలిస్టు డాక్టర్లను నియమించారు. ఈ చర్యల ద్వారా ఖాళీగా వున్న స్పెషలిస్టు డాక్టర్ల పోస్టుల సంఖ్యను 300కు తగ్గింది. స్పెషలిస్టు డాక్టర్లు ప్రభుత్వ సర్వీస్‌పై ఆసక్తి చూపుతున్నారనేందుకు ఇది నిదర్శనం. సుమారు 900 స్పెషలిస్టు డాక్టర్ల పోస్టుల భర్తీకి అవసరమైన అనుకూల పరిస్థి తులను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో ఎపివివిపి ఆస్పత్రుల్లో 411 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను ఏర్పాటు- చేసి వారికి సంబంధించిన విభాగంలో స్పెషలిస్టు డాక్టర్లుగా వ్యవహరించేందుకు ఏర్పాటు- చేశారు.

పకడ్బందీ ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ)కు సంబం ధించి అన్ని ఆస్పత్రుల్లోనూ క్యాడర్‌ను బట్టి సమాన సంఖ్యలో ఉద్యోగులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏపీవీవీపీ కింద 173 సీహెచ్‌సీలు, 53 ఏరియా వైద్యశాలలు, 17 జిల్లా ఆస్పత్రులు, 2 ఎంసీహెచ్‌లతో పాటు మరో చెస్ట్‌ డిసీజ్‌ ఆసుపత్రి నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 251 ఆస్పత్రు లు ఏపీవీవీపీ పరిధిలో ఉన్నాయి. 16,340 పడకల సామర్థ్యం తో ఈ ఆస్పత్రులు సేవలు అందిస్తున్నాయి. 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8 మంది డాక్టర్లు సహా మొత్తం 31మంది సిబ్బంది, 50 పడకల ఆస్పత్రిలో 11 మంది డాక్టర్లు సహా మొత్తం 43 మంది, 100 పడకల సీహెచ్‌సీ, 150 పడకల ఏరియా ఆస్పత్రుల్లో 23 మంది డాక్టర్లు సహా మొత్తం 95 మంది సిబ్బంది, 150 పడకల జిల్లా వైద్యశాలలో 128 మంది, 200 పడకల వైద్యశాలలో 154 మంది, 300 పడకల వైద్య శాలలో 180 మంది, 400 పడకల జిల్లా ఆస్పత్రుల్లో 227 మంది సిబ్బంది పనిచేసే విధంగా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చెెసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement