Thursday, April 18, 2024

ఏపీలో కోటి మందికిపైగా వ్యాక్సిన్: వైద్య శాఖ

కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ప్రతిరోజు వేలల్లో పాజిటివ్ కేసులు నమోదుతున్న నేపథ్యంలో టీకా పంపిణీని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఏపీలో ఇప్పటి వరకూ కోటీ మందికి పైగా కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు, ఉద్యోగులకు వయస్సుతో సంబంధం లేకుండా వ్యాక్సిన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వాళ్లు ఆధార్ నెంబర్ కు బదులు పాస్ పోర్టు నెంబర్ ను కొవిడ్ అప్లికేషన్లో నమోదు చేసి, వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు.

మంగళవారం(జూన్ 1) సాయంత్రానికి కోటీ 82 వేల 648 డోసులు వేశామన్నారు. అందులో 25,35,189 మందికి రెండు డోసులు, 50,12,270 మందికి మొదటి డోసు వేశామన్నారు. మంగళవారం సాయంత్రానికి కొవిషీల్డ్ 90,470 డోసులు, కొవాగ్జిన్ 1,58,530 డోసులు ఉన్నాయన్నారు. బుధవారం(జూన్ 2 తేదీ) సాయంత్రానికి కొవిషీల్డ్ డోసులు పంపిణీ పూర్తయిపోతుందన్నారు. జూన్ 30 లోగా 3,33,270 మందికి కొవాగ్జిన్ సెకండ్ డోసు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇప్పటికే 17,036 మందికి సెంకడ్ డోసు ఇచ్చామని, ఇంకా 3,16,234 మందికి సెకండ్ డోసు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 ఏళ్లు పైడి ఉన్నవారు కోటీ 33 లక్షల 7 వేల 889 మంది ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నెల 15వ తేదీలోగా 8,76,870 డోసులు రానున్నాయన్నారు.  

45 ఏళ్లలోపు ఉన్నా విదేశాలకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగులకు వ్యాక్సిన్ వేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను మార్గదర్శకాలు జారీచేశామన్నారు. విదేశాలకు వెళ్లేవారు ఆధార కార్డుకు బదులు పాస్ పోర్టు నెంబర్ ను కొవిన్ అప్లికేషన్ లో పొందుపరుచుకోవాలని సూచించారు. విదేశాల్లో పాస్ పోర్టుకు జతజేసిన వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను మాత్రమే అనుమతిస్తున్నారన్నారు. దీనివల్ల ఆధార్ నెంబర్ తో వ్యాక్సిన్ తీసుకున్న వారు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయా జిల్లా కలెక్టర్లు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ప్రస్తుతమున్న నిబంధనల దృష్ట్యా పాస్ పోర్టు నెంబర్ జతజేసి రివైజ్డ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అవకాశం లేదన్నారు. ఇదే విషయం కేంద్ర వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శితో చర్చించామని, కొవిన్ వ్యాక్సిన్ అప్లికేషన్ లో పాస్ పోర్టు నెంబర్  ను జతచేసేలా మార్పులు చేయాలని కోరామని తెలిపారు. కేంద్రం అందుకు అంగీకరించిన వెంటనే పాస్ పోర్టు జతచేసిన వ్యాక్సిన్ సర్టిఫికెట్ అందజేస్తామన్నారు.

ఇది కూడా చదవండి: ఇక పై ఆన్‌లైన్‌లో ఆనంద‌య్య మందు..

Advertisement

తాజా వార్తలు

Advertisement