Wednesday, April 24, 2024

ఇసుక తరలింపుపై జేసీ ఆందోళన.. పెన్నా నది వద్ద ఉద్రిక్త‌త..

అనంతపురం : జిల్లాలోని పెద్దపప్పూరు మండలం పరిధిలోని పెన్నా నదిలో ఇసుక రీచ్‌కు వ్యతిరేకంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం ఆందోళనకు దిగారు. మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేతలు వేల టిప్పర్లు ఇసుక తరలిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక యథేచ్ఛ‌గా రాత్రి పగలు తరలిస్తున్నా జిల్లా కలెక్టర్ గాని, మైనింగ్ అధికారులు కాని పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. పెద్దపప్పూరులో ఇసుక రీచ్‌ను బంద్ చేసే వరకు వదిలే ప్రసక్తి లేదని జేసీ ప్రభాకర్ హెచ్చరించారు. అధికారులు నిబంధనలు పాటించకుండా వైసీపీ నేతలకు కాసులు వర్షం కురిపించేలాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆందోళనలో భాగంగా ఇసుక రీచ్ నుంచి బయటికి వస్తున్న లారీలు, టిప్పర్లను జేసీ అడ్డుకున్నారు. ఇసుక తరలింపుకు సంబంధించిన అనుమతులు చూపే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ రోడ్డుపై కూర్చుని నిరసన చేపట్టారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఇసుక రీచ్ వద్దకు చేరుకున్నారు. జేసీ ప్రభాకర్‌ను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement