Friday, April 19, 2024

ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదు.. కానీ: ఆయూష్ కమిషనర్

ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదని ఆయూష్ కమిషనర్ రాములు తెలిపారు. కరోనా చికిత్స పొందే వారు రెగ్యులర్ మందు వాడుతూనే ఆనందయ్య మందును తీసుకోవాలని సూచించారు. ఇదే విషయం హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. పీ, ఎల్, ఎఫ్ మందుల వినియోగానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. కంటిలో వేసే మందు, కే మందుపై వివరాలను త్వరలో కోర్టుకు అందజేస్తామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు. ఆనందయ్య మందును ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని అన్నారు. జిల్లా అధికారులు, ఆనందయ్యతో చర్చించిన తరవాత మందు పంపిణీ తేదీని ప్రకటిస్తామన్నారు.

కృష్ణపట్నం ఆనందయ్య మందు మే 21, 22 తేదీల్లో ఆయూష్ టీమ్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందుల వివరాలను, శాంపిళ్లు సేకరించామని ఆయూష్ కమిషనర్ రాములు తెలిపారు. సేకరించిన శాంపిళ్లను ల్యాబ్ లకు పంపించి వివిధ టెస్టులు నిర్వహించామన్నారు. ఇందుకు కేంద్ర సంస్థ సాయం కూడా తీసుకున్నామన్నారు. ఆనందయ్య మందు తీసుకున్నవారి వివరాలను, వారి అభిప్రాయాలను సేకరణకు కేంద్ర సంస్థ సహాయం తీసుకున్నామన్నారు. ల్యాబ్ రిపోర్టులు, కేంద్ర సంస్థ నివేదికలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమగ్రంగా చర్చించారన్నారు.

ఆనందయ్య మందులో పీ,ఎల్, ఎఫ్, కే తో పాటు కంటిలో వేసే మందు.. ఇలా అయిదు రకాలున్నాయన్నారు.’ కే ‘శాంపిళ్లు ఇవ్వలేదని, కంటిలో వేసే మందు తక్కువ మందికే ఇచ్చామని ఆనందయ్య తెలిపారన్నారు. ‘కే’మందు మెటీరియిల్ లేకపోవడంతో తయారీ విధానం చూడలేకపోయామన్నారు. పీ, ఎల్, ఎఫ్ మందులు సంతృప్తికరంగా ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనడానికి ఆధారాలు కనిపించలేదని తెలిపారు. ఈ మూడు రకాలు వినియోగానికి పనికొస్తాయని నిపుణులు తెలిపారన్నారు. ఈ మందులతో కొవిడ్ నయమవుతుందనడానికి ఆధారాలు లభించలేదన్నారు. అదే సమయంలో సైడ్ ఎఫెక్ట్ లు ఉన్నాయనడానికి కూడా ఆధారాల్లేవన్నారు. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకునే పీ.ఎల్.ఎఫ్ మందుల వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. కంటిలో వేసే మందుపై రిపోర్టులు మూడు వారాల్లో రావొచ్చునన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement