Thursday, March 28, 2024

సినీ ఫక్కీలో జైలు నుంచి ఖైదీ పరార్

కర్నూలు పంచలింగాల కారాగారం నుంచి సినిమా ఫక్కీలో కులాయి అలియాస్ నాని ఖైదీ పరారయ్యారు. గురువారం ఉదయం కాలకృత్యాల అనంతరం ఖైదీ ఆచూకీ  కనబడకపోవడంతో కారాగారంలో పరిశీలించిన జైలు సిబ్బంది… ఖైదీ పరారైనట్లు గుర్తించారు. వారం క్రితమే ఈ ఖైదీ కర్నూలు సబ్ జైలు అధికారుల కళ్లుగప్పి పరారు కాగా.. కుటుంబ సభ్యులు అతన్ని మందలించి రెండు రోజుల క్రితమే జైలర్ కు తిరిగి అప్పగించారు. అయితే, ఖైదీని అప్పగించి పట్టుమని మూడు రోజుల కాకముందే మరోసారి జైలు సిబ్బంది కళ్లుగప్పి ఖైదీ తప్పించుకోవడం గమనార్హం.

కాగా, జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ, కర్నూలు జిల్లా మహానంది మండల పరిధిలో ఓ హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నాడు. గతంలోనూ ఓసారి జైలు ప్రహరి గోడ ఎక్కి తప్పించుకునేందుకు యత్నించాడు. నిరంతరం సిసి కెమెరాలు,  సిబ్బంది నిఘా నీడ, ఎత్తైన ప్రహరీ గోడ, వీటి చుట్టూ ఇనుప కంచె, తీగలకు విద్యుత్ ప్రసారం ఉన్నప్పటికీ ఖైదీ పరారు కావడం చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించిన జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పంచలింగాల సమీపంలోని కారాగారాన్ని స్వయంగా సందర్శించి ఖైదీ తప్పించుకున్న వైనాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో జైలరు. జైలు సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement