Friday, March 29, 2024

మెడ్‌టెక్‌ జోన్‌ను సందర్శించిన వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా బృందం

గత కొద్ది రోజులుగా ఇండియాలో పర్యటిస్తోన్న వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వ బృందం ఆంధ్రప్రదేశ్‌లో మెడ్‌టెక్‌ జోన్‌ను శనివారం సందర్శించింది. జోన్‌లోని పలు సంస్ధలను పరిశీలించిన ఈ బృందం పలు కంపెనీల ప్రతినిధిలు, స్టార్టప్‌లతో సమావేశమైంది. మెడ్‌టెక్‌ జోన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టెఫాన్‌ డాసన్‌ (ఎంఎల్‌సీ, మినిస్టర్‌ ఫర్‌ ఎమర్జెన్సీ సర్వీసెస్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ డిజిటల్‌ ఎకనమీ, మెడికల్‌ రీసెర్చ్‌, వలెంటీరింగ్‌), ప్రొఫెసర్‌ పీటర్‌ క్లీంకెన్‌ ఏసీ (చీఫ్‌ సైంటిస్ట్‌– వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా), నషిద్‌ చౌదరి (ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ట్రేడ్‌ కమిషనర్‌, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఇండియా–గల్ఫ్‌ రీజియన్‌), డాక్టర్‌ జితేంద్ర శర్మ (మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌టెక్‌ జోన్‌) పాల్గొన్నారు.

ఈ సదస్సులో స్టెఫాన్‌ డాసన్‌ మాట్లాడుతూ… వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా మంత్రిగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వైద్య పరిశోధనలు, ఆవిష్కరణలు మనం ఆరోగ్యంగా జీవించేందుకు తోడ్పడుతున్నాయన్న ఆయన పరిశోధనలు, ఆవిష్కరణలకు ఇది అత్యంత కీలకమైన సమయమన్నారు. అత్యధిక వృద్ధి సామర్ధ్యం కలిగిన స్టార్టప్స్‌కు సైతం మద్దతు అందించేందుకు పెర్త్‌ ల్యాండింగ్‌ప్యాడ్‌ కార్యక్రమం కూడా ప్రారంభించామంటూ సాంకేతిక రంగంలోని కంపెనీలు వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాలో పెట్టుబడులు పెట్టి తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌ టెక్‌ జోన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జితేంద్ర శర్మ మాట్లాడుతూ.. వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ప్రతినిధులు ఇక్కడకు రావడం ఆనందంగా ఉందన్నారు. వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా, ఇండియాకు ఎన్నో సారుప్యతలున్నాయన్న ఆయన జీ20లో భాగంగా వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాతో మెడ్‌టెక్‌ జోన్‌ ఓ జీ2జీ ఒప్పందాన్ని కేవలం వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా కోసం వైద్య సాంకేతికతల అభివృద్ధి కోసం చేసుకునే దిశగా ఆలోచన చేయాల్సిందిగా సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement