Wednesday, April 24, 2024

ప్రతి వంద కి.మీ.లకు ఓ వాగ్దానం.. అన్నమయ్య జిల్లాలో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర

తిరుపతి, (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర గురువారం 39వ రోజు 500 కిలోమీటర్ల మైలు రాయి దాటింది. ఆ సందర్బంగా తాము అధికారంలో వచ్చిన వంద రోజుల్లో అన్నమయ్య జిల్లా సి టీ ఎం వద్ద టమాటో ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. గత డిసెంబర్ నెల 27వ తేదీ కుప్పంలో మొదలైన పాదయాత్ర చిత్తూరు, తిరుపతి జిల్లాల గుండా సాగి ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం మదనపల్లి నియోజకవర్గం లో ఆడుగుపెట్టిన యాత్ర 39వ రోజు కు చేరింది. వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవుతున్న లోకేష్ ప్రతి వంద కిలోమీటర్ల యాత్ర పూర్తి అయిన సందర్బంగా స్థానికులకు ప్రత్యేక హామీలు ఇస్తూ గుర్తుగా శిలా ఫలకం ఏర్పాటు చేసే ఆనవాయితీ ని కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో యాత్ర 8వ రోజు న 100 కిలోమీటర్ల మైలు రాయి దాటినప్పుడు గత ఫిబ్రవరి 3వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాలెం వద్ద కిడ్నీ వ్యాధి గ్రస్తులకు డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే యాత్ర 16వ రోజున 200 కిలోమీటర్లు ఆదిగమించినప్పుడు గంగాధర నెల్లూరు వద్ద డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఫిబ్రవరి 11వ తేదీన హామీ ఇచ్చారు. తరువాత ఫిబ్రవరి 21వ తేదీన 23 వ రోజున యాత్ర 300 కిలోమీటర్లు దాటినప్పుడు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమానుపురం వద్ద 13 గ్రామాల దాహార్తి తీర్చే నీటి పధకాన్ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు.

- Advertisement -

ఆపై మార్చి 1వ తేదీన 32వ రోజు యాత్ర 400 కిలోమీటర్లు చేరినప్పుడు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నరేంద్ర పురం వద్ద ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక గురువారం యాత్ర 39వ రోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం సి టీ ఎం వద్ద 500 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది. ఆ సందర్బంగా సి టీ ఎం 2 వద్ద టమోటో ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రతి వంద కిలోమీటర్లు పూర్తి అయిన చోట ఒక శిలాఫలాకాన్ని ఆవిష్కరించి తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామనే హామీలను ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement