Wednesday, April 24, 2024

AP: కారుతో గుద్ది, గొంతుకోసి వ్యక్తి దారుణ హత్య.. ప్రాణాలు తీసిన మూఢనమ్మకం

చిట్వేలి, (ప్రభన్యూస్): ద్విచక్ర వాహనంపై తన భార్యతో కలిసి వెళ్తున్న ఓ వ్యక్తిని వెంబడించి స్కార్పియో వాహనంతో ఢీకొట్టి ఆపై పడిపోయిన వ్యక్తి కళ్లలో కారం కొట్టి కత్తితో గొంతు కోసి చంపేశారు.. ఇంత దారుణంగా హత్య చేసిన ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం జ‌రిగింది. కొంతకాలంగా అతను చేస్తున్న తాంత్రిక పద్ధతితో అనుమానాలను రేకెత్తించింది. ఈ క్రమంలో ఒక యువతి ఆత్మహత్య చేసుకొని చ‌నిపోవ‌డంతో ఆమె కుటుంబీకులు మంత్ర తంత్రాలు చేసే వ్యక్తే కారణమని భావించారు. దీంతో కాపు కాసి, వెంటాడి గొంతు కోసేశారు. ఇదంతా మూఢ న‌మ్మ‌కం వ‌ల్ల‌నే జ‌రిగింద‌ని పోలీసులు చెబుతున్నారు.

చిట్వేలి మండలం తిమ్మాయపాలెం పంచాయతీలోని గట్టుమీద పల్లెకు చెందిన చుక్కా రామయ్య అనే వ్యక్తి పల్లెల్లో పాత చీరలను తీసుకొని బొంతలు తయారుచేసి దాంతో వచ్చిన సొమ్ముతో జీవనం సాగించేవాడు. దీంతోపాటు పిల్లలకు అనారోగ్యం చేసినప్పుడు బాలగ్రహ వంటివి పరిశీలించి మంత్రించి యంత్రాలు వేసేవాడు. తన వ్యాపార వృత్తి లో రైల్వేకోడూరు సమీపాన గల రాఘవ రాజపురంలో ఓ నివాసాన్ని ఏర్పాటు చేసుకుని కొంతకాలం అక్కడే ఉండేవాడని బంధువులు చెబుతున్నారు.

ఈ క్రమంలో ఇటీవల రాఘవరాజుపురానికి చెందిన ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటనకు రామయ్య కారణమని ఆ కుటుంబీకులు అనుమానించారు. అదే అంశంపై రైల్వేకోడూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రెండు వారాలుగా కోడూరు పోలీసులు రామయ్యను విచారిస్తూనే ఉన్నారు. ఆదివారం జరిగిన విచారణలో ఆ యువతి ఆత్మహత్య అంశంలో రామయ్య పాత్ర ఏమీ లేదని తేల్చేసినట్లు సమాచారం. దీంతో అసంతృప్తి చెందిన ఆ యువతి కుటుంబీకులు ప్రతీకారం తీర్చుకునే దిశగా రామయ్యను వెంటపడ్డారు.

కోడూరునుంచి చిట్వేలి వైపు వస్తుండగా సిద్ధారెడ్డిపల్లె – గద్దలరేవుపల్లె మధ్యలో ఒక స్కార్పియో వాహనంలో కొందరు రామయ్య వాహనాన్ని ఢీకొట్టించి అక్కడే హతమార్చే ప్రయత్నాలు చేశారు. రామయ్యతో పాటు ఉన్న భార్య సమక్షంలోనే ఇదంతా జరగడం విశేషం. వెంటనే అతన్ని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకు రాగా వారు మెరుగైన చికిత్సకోసం తిరుపతికి సిఫారసు చేశారు. అంబులెన్స్లో రామయ్యను తిరుపతి స్విమ్స్ కు తరలించారు. అక్కడి వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిని గమనించి అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement