కర్నూలు జిల్లా ఆత్మకూరులో పోలీసులు ఐదు రోజులపాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఓ ప్రార్థనా మందిరం నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య శనివారం(జనవరి 8) తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డిపై ఓ వర్గం వారు దాడికి యత్నించగా, ఆయన పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న ఆందోళనకారులు శ్రీకాంత్రెడ్డి కారును ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. పోలీస్ స్టేషన్పై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కంటికి గాయం కాగా, మరో ఇద్దరు ఎస్ఐలు గాయపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాలకు చెందిన 30 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ సుధీర్ కుమార్రెడ్డి చెప్పారు. పట్టణంలో ఐదు రోజులపాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వెల్లడించారు. మొత్తం 500 మందితో కూడిన అదనపు పోలీసు బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మతవిద్వేషాలు రెచ్చగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆత్మకూరు పట్టణంలో పరిస్థితి అదుపులోనే ఉందని స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital