Monday, March 25, 2024

స్ఫూర్తిని రగిలించే కథలు.. ఐఐటీ ర్యాంకర్లకు సీఎం అభినందనలు

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, గిరిజన రెసిడెన్షియల్‌ స్కూళ్ల నుంచి ఐఐటీ సహా ఇతర ఉన్నత విద్యా ప్రవేశాలకోసం పరీక్షలు రాసి ర్యాంకులు సాధించిన విద్యార్థులను సీఎం వైయస్‌.జగన్‌ అభినందించారు. క్యాంపు కార్యాలయంలో వీరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరినీ పరిచయం చేసుకున్నారు. వారి నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేలా, వారిని మరింత ప్రోత్సహించేలా మాట్లాడారు.

విద్యారంగంమీద ప్రభుత్వాలు చూపించే శ్రద్ధ, ధ్యాస అన్నవి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాయనడంలో ఎలాంటి సందేహం లేదని సీఎం అన్నారు. అమ్మ-ఒడి, నాడు-నేడు సహా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని, కాని, వీటన్నింటికంటే.. ముఖ్యమైనది ఏంటంటే… విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపే అధికారులు మన ముందే ఉన్నారన్నారు. “మీ ముందే ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు కాంతిలాల్‌ దండే, సునీతలు ఇద్దరూ మాట్లాడారు. వీళ్లుకూడా మీలాంటి వాళ్లే. షెడ్యూల్‌ కులాలకు చెందినవారు… ఐఏఎస్‌ అధికారులు అయ్యారు. మీరంతా కూడా వీరి నుంచి స్ఫూర్తి పొందాలి. ఇది అసాధ్యం కానేకాదు. ఐఐటీ వరకూ మీరు చేరుకోగలిగారు. ఇది దాటితే.. ప్రపంచం మీకు మెరుగైన అవకాశాల రూపంలో ద్వారాలు తెరుస్తుంది. ఆ ప్రపంచంలో ఇప్పటికే మీరు ఒక స్థాయికి చేరుకున్నారు. మొట్టమొదటి అడుగు వేసినట్టే భావించండి’’ అని సీఎం విద్యార్థులనుద్దేశించి అన్నారు. దేవుడి దయవల్ల బాగా కష్టపడుతున్నారని, బాగా చదవగలుగుతున్నారని, దీన్ని ఇలాగే కొనసాగిస్తే, దృష్టి కేంద్రీకరిస్తే.. కచ్చితంగా ఈ ఐఏఎస్‌ల స్థానాల్లో కూర్చుంటారన్నారు.

ఐఏఎస్‌ల్లో చాలామంది నేపథ్యాలు అత్యంత సాధారణమైనవని, సీఎంఓలో అదనపు కార్యదర్శిగా ఉన్న ముత్యాలరాజే దీనికి ఉదాహరణ అంటూ…, తన జీవితంలో ఆయన చూసిన పరిస్థితులను విద్యార్థులతో పంచుకుంటారన్నారు. “ఇదంతా మీకు మంచి స్ఫూర్తినిస్తుంది. ముత్యాలరాజు జీవితం… హృదయాలను కదిలిస్తుంది. వాళ్ల ఊరికి పోవాలంటే బోటులో పోవాలి. మనకు స్ఫూర్తినిచ్చే కథలు ఎక్కడో లేవు… ఇదే గదిలో ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల రూపంలో ఉన్నాయి. మీరు ఇదే కృషి కొనసాగిస్తే.. కచ్చితంగా మీరు ఈ స్థాయికి చేరుకుంటారు. నా పక్కనున్న స్థానాల్లో మీరుకూడా కనిపిస్తారు.’’ అని సీఎం అన్నారు.

తన వైపు నుంచి సీఎంఓ అదనపు కార్యదర్శి ముత్యాలరాజు అందుబాటులో ఉంటారని, ఫోన్‌ నంబరు ఇస్తారని, ఎప్పుడు అవసరమున్నా.., ఏం కావాలన్నా.. సహాయంగా నిలుస్తారంటూ విద్యార్థులకు సీఎం భరోసానిచ్చారు. ఎలాంటి క్లిష్ట పరిస్థులున్నా.. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నారు. ఈ అధికారులంతా మీ స్థాయినుంచే వచ్చారు కాబట్టి, ఎలాంటి సమస్యలు వస్తాయి? వాటిని ఎలా పరిష్కరించాలి? ఏరకంగా మీకు తోడుగా నిలవాలనే విషయాలు వీరికి బాగా తెలుసని సీఎం వారికి చెప్పారు. గిరిజన ప్రాంతాలనుంచి, అలాగే కర్నూలులోని ఎమ్మిగనూరు లాంటి ప్రాంతాలనుంచి ఐఐటీలు సాధించారంటే ఇది నిజంగా గర్వించదగ్గ విషయమంటూ విద్యార్థుల ప్రతిభను సీఎం కొనియాడారు.

“పాదయాత్ర చేసినప్పుడు కూడా కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని ఎంత వెనకబడి ఉన్నాయో చూశాను. వెనకబడ్డ ప్రాంతాల్లో ఇది ఒకటి. అలాంటి ప్రాంతనుంచి కూడా ఇద్దరు, ముగ్గురు కలెక్టర్లు వస్తే మొత్తం వ్యవస్థే అక్కడ మారిపోతుంది. అక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు పెరుగుతాయి. పెద్ద పెద్ద చదువులు చదవాలన్న తపన పెరుగుతుంది. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని, మార్గదర్శకంగా భావించి ఇంకా కొంతమంది మెరుగైన చదువులు చదివే పరిస్థితి వస్తుంది. మొత్తం మార్పే కనిపిస్తుంది. ఇది జరగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’’ అంటూ సీఎం వారికి స్ఫూర్తినిచ్చేలా వారితో మాట్లాడారు.  మిమ్మల్ని అభినందిస్తూ ప్రభుత్వం తరఫు నుంచి మీకు ల్యాప్‌టాప్స్‌ కూడా అందించాం. మీరు ఇంకా పైస్థానంలోకి వెళ్లాలి. మిమ్మల్ని ఆస్థాయిలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ సీఎం ముగించారు.

- Advertisement -

ఇది కూడా చదవండి: కలెక్టర్ సుప్రీం కంటే సుప్రీమా?: రేవంత్ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement