Wednesday, April 24, 2024

పథకాల పేరుతో ప్రజలకు ఎర.. పన్నుల పేరుతో లూటీ

ముఖ్యమంత్రి జగన్ నవరత్నాల పేరుతో ప్రజలకు నవరత్న ఆయిల్ రాశారని టీడీపీ నేత, మాజీ మంత్రి కొట్టు రవీంద్ర అన్నారు. పన్నుల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ ధరలపై అసెంబ్లీలో మొసలి కన్నీరు కార్చారని, మరి ఇప్పుడు ఎలా పెంచారు ? అని ప్రశ్నించారు.  రాష్ట్ర వాటా తగ్గించుకుంటే పెట్రోల్, డీజిల్ రేటు తగ్గించుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి గెలించారని వారికి పన్నుల బాదుడు బహుమతిగా ఇస్తున్నారా ? అని నిలదీశారు.  

మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి పన్నులు 15 శాతామేగా పెంచుతున్నామని చెబుతున్నారని, 15 శాతం అంటే మీకు తక్కువగా కనిపిస్తుందా ? అని అడిగారు. పథకాల పేరుతో ప్రజలకు ఎరా వేసి పన్నుల పేరుతో లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ‘’మంత్రి పేర్ని నాని పన్నులు పెంచడం లేదని అంటున్నారు, మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయంలో మీ పుత్రరత్నం సమీక్షలు చేయడం ఏంటి ? మచిలీపట్నంలో వైసీపీ నాయకులు షాడో మంత్రులుగా వ్యవహరిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం కోసం మచిలీపట్నం నుంచి కార్యకర్తలను తరలించడం వల్ల బందరులో కరోనా కేసులు పెరిగాయన్నారు.

మంత్రి పేర్ని నాని వల్లే మచిలీపట్నంలో చాలామంది కరోనాతో చనిపోయారని పేర్కొన్నారు. మచిలీపట్నం ప్రభుత్వం హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక ఒక్క గంటలో 6 మంది చనిపోయారని తెలిపారు. షాడో మంత్రులుగా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలు మంగలేరులో మట్టి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మంత్రి కుమారుడు సచివాలయం ప్రారంభించడం ఏంటి ? అని అడిగారు. అది ప్రభుత్వ కార్యాలయమా ?  వైసీపీ కార్యాలయమా ? అని నిలదీశారు. కరోనా సమయంలోఆదాయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే  ప్రభుత్వం ప్రజలపై పన్నులు వేయడం సరికాదన్నారు. కేంద్రం ఇచ్చే అప్పు కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రజలపై ఆర్ధిక భారం మోపుతున్నారని ఆరోపించారు. పెంచిన పన్నులను రద్దు చేయాలి లేనిపక్షంలో ప్రజలను కలుపుకుని ఉద్యమం చేస్తాం కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement