Friday, March 29, 2024

TS: ముగియ‌నున్న‌ స‌ర్పంచ్ ల ప‌ద‌వీ కాలం – పంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్ల పాల‌న‌కు స‌ర్వ‌సిద్ధం….

ఈ నెల 31తో సర్పంచ్‌ల పదవీకాలం పూర్తికానున్న నేపథ్యంలో పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు కలెక్టర్లు ప్రభుత్వానికి జాబితాలను పంపారు. ఈ నెల 30న అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత సర్పంచ్‌ల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియనుండడంతో.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుముఖంగా లేని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులతో కాకుండా ప్రత్యేక అధికారులతో ప్రజా పాలన చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు రానున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగం (మిషన్ భగీరథ) అసిస్టెంట్ ఇంజనీర్లు, సమగ్ర శిశు అభివృద్ధి సేవల (ఐసీడీఎస్) సూపర్‌వైజర్లు, మండల విద్యాధికారులు, వ్యవసాయ అధికారులు, వెటర్నరీ అధికారులు, ఆరోగ్య శాఖ సూపర్‌వైజర్లు, ఉద్యానవనశాఖ అధికారులు, పంచాయతీల్లో సబ్‌ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, మండల పరిషత్ సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు, టైపిస్టులు, గెజిటెడ్ హెడ్మాస్టర్లు, హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తారు.

కాగా.. ఆయా మండలంలోని పంచాయతీల సంఖ్యను బట్టి ఇతర శాఖల అధికారుల సేవలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మండలాలు చిన్నవి కావడంతో ఇతర శాఖల అధికారుల సేవలు తక్కువ సంఖ్యలోనే అవసరమని భావిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నందున వీటికి అవసరమైన నియామకాలు చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్లు నిర్ణీత నమూనాలో జాబితాలను రూపొందించారు. ప్రతి అధికారి హోదా ఒక గ్రామానికి ప్రత్యేక అధికారి. సెల్ ఫోన్ నంబర్, వారు నిర్వహించే విభాగం సమాచారం. 12 వేల మందికి పైగా అధికారులు, సిబ్బంది అవసరమని, ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవులో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని కలెక్టర్లకు సూచించారు. ప్రత్యేక అధికారుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఈ నెల 29న ఉత్తర్వులు జారీ చేయనున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement