మహబూబ్నగర్
సాంబశివుడి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
మహబూబ్నగర్, మార్చి 27 (కెఎన్ఎన్ బ్యూరో) : మాజీ మావోయిస్టు సాంబశివుడి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెరాస పొలిట్ బ్యూరో సభ్యుడు, జిల్లా కో కన్వీనర్ బెక్కం జనార్ధన్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ హత్యకు సీమాంధ్ర సర్కారే పూర్తి బాధ్యత వహించాలని ఆయన ఆరోపించారు. సీమాంధ్ర డీజీపీ అరవింద్రావు మేధావి రూపంలో ఉన్న క్రిమినల్ అని, గతంలో అనేకమంది పౌర హక్కుల నేతలను, ఉద్యమకారుల హత్యల వెనక కుట్ర అరవింద్రావుదేనని ఆయన విమర్శించారు. సాంబశివుడి హత్యలో కూడా అరవింద్రావు పాత్రను అనుమానించాల్సి వస్తోందని జనార్ధన్ అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని పోలీస్ నిర్భంధాల ద్వారా అణచలేని సీమాంధ్ర సర్కార్ దొంగచాటు హత్యలతో అణిచి వేయడానికి పూనుకుందని, ఈ ప్రభుత్వం దానికి తగిన మూల్యాలు చెల్లించకతప్పదని ఆయన హెచ్చరించారు. ఇలాంటి పిరికి పందల చర్యల వల్ల ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. సాంబశివుడి హత్యలో అనేక అనుమానాలు ఉన్నందు వల్ల హైకోర్టు సిట్టింగ్ జడ్జిచేత విచారణ జరిపించి నిజాలు బయటపెట్టాలని జనార్ధన్ డిమాండ్ చేశారు. సాంబశివుడి కుటుంబానికి టిఆర్ఎస్ జిల్లా కమిటీ తరుపున ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ధర్మభిక్షం మృతి పట్ల సంతాపం
పార్లమెంట్ మాజీ సభ్యులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు సీపీఐ నాయకుడు ధర్మభిక్షం మృతి పట్ల టిఆర్ఎస్ జిల్లా కో కన్వీనర్ బెక్క జనార్ధన్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు, బంధువులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరో పోరాట యోధుడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కారులంతా ధర్మభిక్షం ఆశయాలను, అంకితభావాన్ని అనుసరించాలని ఆయన పిలుపు నిచ్చారు.
రాశి ఫలాలు






